జనవరి 10 నుంచి 20 వరకు జన జాగరణ్ ప్రచారం
500 జిల్లాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ పరేడ్
సంయుక్త కిసాన్ మోర్చా జనరల్ బాడీ సమావేశం నిర్ణయం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎంఎస్పి, రుణమాఫీ, విద్యుత్ బిల్లులు రద్దు కోరుతూ.. పోరాటాలను తీవ్రతరం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) నిర్ణయించింది. గురువారం ఎస్కెఎం ఆలిండియా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే ఏడాది (2024)లో రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రధాన డిమాండ్ల సాధనకు అన్ని పంటలు సి2ప్లస్50 శాతం ఎంఎస్పితో సేకరణ, అప్పుల ఉచ్చు నుండి విముక్తి చేసే రుణమాఫీ కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా తేని (లఖింపూర్ ఖేరీ రైతుల హత్యాకాండ వెనుక ప్రధాన కుట్రదారుడు)ని తొలగించాలని, ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చింది.20 రాష్ట్రాల్లోని ఎస్కెఎం రాష్ట్ర యూనిట్లు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా ఇంటింటికీ ప్రచారం, కరపత్రాల పంపిణీతో భారీ ‘జన జాగరణ్’ ప్రచారాన్ని నిర్వహిస్తాయి. పెద్దయెత్తున నిరుద్యోగం, నియంత్రణ లేని ధరల పెరుగుదల, పేదరికం, రుణభారం, రైతులు, కార్మికులు, ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధానాలు, బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను బహిర్గతం చేయడమే ఈ భారీ ప్రచారం లక్ష్యమని ఎస్కెఎం పేర్కొంది. పట్టణ వలసలకు, ఆర్ఎస్ఎస్-బిజెపి పాలనలో కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా జరగనున్న ఉమ్మడి, సమన్వయ పోరాట కార్యక్రమాల్లో ప్రజలు పెద్దయెత్తున పాల్గొనేలా ఈ ప్రచారం జరుగుతుందని, 30.40 కోట్ల కుటుంబాల్లో కనీసం 40 శాతం కుటుంబాలను కవర్ చేయాలనే లక్ష్యంతో ప్రచారానికి సిద్ధం కావడానికి రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు వెంటనే సమావేశమవుతాయని తెలిపింది.ఎస్కెఎం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో 2024 గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న ‘ట్రాక్టర్ పరేడ్’ను నిర్వహించనుంది. కనీసం 500 జిల్లాల్లో కవాతు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరేడ్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని రైతులకు ఎస్కెఎం విజ్ఞప్తి చేసింది. ట్రాక్టర్ కవాతులో పాల్గొనే రైతులు రాజ్యాంగ సంస్థల జెండాలతోపాటు జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సోషలిజం సూత్రాలను పరిరక్షిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేయనున్నారు. ట్రాక్టర్లతో పాటు ఇతర వాహనాలు, మోటారు బైక్లు కూడా కవాతులో పాల్గొంటాయి.మతపరమైన, కులతత్వ పోలరైజేషన్తో ప్రజలను దోపిడీ చేసే, విభజించే కార్పొరేట్, మతోన్మాదాన్ని ఓడించే సంకల్పానికి గుర్తుగా జన జాగరణ్ ప్రచారం, ట్రాక్టర్ కవాతును విజయవంతం చేయాలని ఎస్కెఎం దేశ వ్యాప్తంగా రైతులకు పిలుపునిచ్చింది. డిమాండ్లన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్కెఎం నేతలు అన్నారు.