రాజ్యసభలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్వోతి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లో 1,78,951 ఇళ్లు ఇంకా పూర్తి కాలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్వోతి తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పిఎంఎవై-జి కింద ఫిబ్రవరి 1 నాటికి ఏపికి 2,46,430 ఇళ్లు మంజూరు కాగా, 67,479 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. 1,78,951 ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణకు ఒక్క ఇళ్లు కూడా మంజూతు కాలేదని మంత్రి తెలిపారు. కాగా తిరుపతి ఐఐటి క్యాంపస్ శాశ్వత భవనం నిర్మాణానికి సంబంధించిన సివిల్ వర్క్స్, ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1091.75 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికరింగ్, నాన్ రికరింగ్ ఖర్చుల కోసం ఇప్పటివరకు రూ.190.17 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే ఐఐటి తిరుపతి క్యాంపస్ తొలిదశ కింద చేపట్టిన శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి చేసి యాజమాన్యానికి అప్పగించినట్లు మంత్రి తెలిపారు.