తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మావోయిస్టులు సృష్టించిన భీభత్సానికి గత దశాబ్దన్నర కాలంలో డజన్ల కొద్దీ సిపిఎం కార్యకర్తలు అమరులైన నేల ఝార్గ్రామ్. బెంగాల్లో వామపక్ష కూటమి పాలనను పడగొట్టడానికి ప్రణాళి కాబద్ధమైన ఎత్తుగడలను ప్రారంభించిన ప్రాంతం. ఇక్కడ టిఎంసి భయోత్పాతాన్ని ప్రతిఘటిస్తూ లోక్సభ ఎన్నికల్లో వామపక్ష కూటమి గట్టి ఉధృత ప్రచారం నిర్వహిస్తోంది. షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గమైన ఝార్గ్రామ్ నుండి వామపక్ష అభ్యర్థి సోనా మణి ముర్ము పోటీ చేస్తున్నారు. ఆమె ఎర్ర జెండాలతో నిర్వహిస్తున్న వీర కవాతు స్థానిక ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రజా కార్యకర్త, రేడియో జాకీ అయిన సోనామణి, సంతాల్, బెంగాలీ, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడి గిరిజనులు, గిరిజనేతరులు అనే తేడా లేకుండా అభిమానం సంపాదించుకున్నారు. ఎన్నో హక్కుల పోరాటాల్లో పాల్గొన్నారు. వామపక్ష కూటమి కార్యకర్తలు, నాయకులు సోనామణి విజయం కోసం ఉత్సాహంగా, జోరుగా ప్రచారం చేస్తున్నారు. బిజెపి నుంచి ప్రణత్ తుట్టే, టిఎంసి నుంచి జోరన్, ఇతర ప్రధాన అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మే 25న ఎన్నికలు జరగనున్నాయి.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/murmu-1.jpg)