అయోధ్యకు స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ – టికెట్లకు ఆఫర్లు

న్యూఢిల్లీ : అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా … ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా కనిష్ఠంగా రూ.1,622 నుంచే టికెట్ల ధరలు ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలన్నింటికీ (వన్‌-వే) ఈ సేల్‌ వర్తిస్తుందని తెలిపింది. స్పైస్‌మ్యాక్స్‌, యూఫస్ట్‌ వంటి యాడ్‌-ఆన్‌లు సహా సీట్ల ఎంపిక ఛార్జీలపై అదనంగా 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించింది. ఈ సేల్‌లో భాగంగా టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు విమానం బయలుదేరడానికి 96 గంటల ముందు వరకు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.

ఆఫర్‌ వివరాలు …

జనవరి 22 నుంచి 28 మధ్య బుక్‌ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వస్తుంది. జనవరి 22 నుంచి 2024 సెప్టెంబర్‌ 30 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ముంబయి-గోవా, ఢిల్లీ-జైపుర్‌, గువాహటి-బాగ్‌డోగ్రా వంటి ప్రముఖ మార్గాల్లో కనిష్ఠ ధర అయిన రూ.1,622 వర్తించనుంది. అయోధ్యకు రవాణా సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా స్పైస్‌జెట్‌ ఇప్పటికే వివిధ నగరాల నుంచి ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక విమానాలను ప్రారంభించనుంది. రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని వేడుకకు హాజరవుతున్న వారి కోసం ఆదివారం ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఎం-సైట్‌, మొబైల్‌, యాప్‌, వెబ్‌సైట్‌, రిజర్వేషన్‌ కౌంటర్లు, ప్రత్యేక ట్రావెల్‌ ఏజెంట్ల వద్ద బుక్‌ చేసుకున్న అన్ని టికెట్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

➡️