Bar Asso: లేఖ రాసేందుకు అధికారం ఇవ్వలేదు

ఎన్నికల బాండ్లపై రాష్ట్రపతికి లేఖపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ వివరణ
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అదిష్‌ అగర్వాల రాసిన లేఖ గందరగోళం సృష్టించిన నేపథ్యంలో ఆ సంఘం వివరణ ఇచ్చింది. రాష్ట్రపతికి లేఖ రాసేందుకు తాము అగర్వాలకు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంపై న్యాయస్థానం మరోసారి విచారణ జరిపే వరకూ సుప్రీంకోర్టు తీర్పును నిలిపివేయాలని మంగళవారం ముర్ముకు రాసిన లేఖలో అగర్వాల విజ్ఞప్తి చేశారు. ‘రాజ్యాంగపరమైన ప్రతిష్టంభనను కలిగించే విధంగా తీర్పులు వెలువరించడానికి సుప్రీంకోర్టును అనుమతించకూడదు. పార్లమెంట్‌ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా తీర్పులు ఇవ్వడాన్ని అనుమతించకూడదు. పార్లమెంటులో ప్రజాప్రతినిధులందరూ కలిసి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడాన్ని అనుమతించకూడదు. రాజకీయ పార్టీల పనితీరును ప్రశ్నించేలా తీర్పులు ఇవ్వకూడదు’ అని ఆయన ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు అందించిన కార్పొరేట్‌ సంస్థల వివరాలను బహిర్గతం చేస్తే అవి కక్షసాధింపు చర్యలకు గురయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ లేఖపై బార్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆల్‌ ఇండియా బార్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ హోదాలో అగర్వాల ఈ లేఖ రాసినట్లు కన్పిస్తోందని తెలిపింది. అయితే కమిటీ సభ్యులు ఆయనకు అలా లేఖ రాసే అధికారం ఇవ్వలేదని, అంతేకాక ఆ లేఖలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను వారెవ్వరూ సమర్ధించడం లేదని స్పష్టం చేసింది. అగర్వాల్‌ చర్య, ఆయన రాసిన లేఖలోని వివరాలు సుప్రీంకోర్టు అధికారానికి భంగకరంగా ఉన్నాయని, ఈ చర్యను తాము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని బార్‌ అసోసియేషన్‌ ఆ తీర్మానంలో తెలియజేసింది.

➡️