న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల తరుణంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. సమాంతరంగా పొలిటికల్ వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి జనానికి మంటపుట్టిస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారానికి ఉష్ణోగ్రతలు అడ్డంకిగా మారుతోందని భారత వాతావరణ శాఖ నివేదిక తెలియజేస్తోంది. 543 పార్లమెంటు స్థానాల్లో 495 నియోజకవర్గాల్లో ఉష్ణోగ్రతలను ఐఎండి అంచనా వేసింది. 495 నియోజకవర్గాల్లో 59 నియోజకవర్గాల్లో 40-42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. ఇక 194 నియోజకవర్గాల్లో 37.5-40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 35-37.5 డిగ్రీల సెల్సియస్ 86 నియోజకవర్గాల్లో నమోదవుతాయి. 30 డిగ్రీల ఉష్ణోగతలు నమోదయ్యే నియోజకవర్గాలు కేవలం 15 మాత్రమే ఉన్నాయని ఐఎండి తెలిపింది. ప్రధానంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ఉష్ణోగ్రతలు రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారానికి అడ్డంకిగా మారనున్నాయనేది స్పష్టంగా అర్థమౌతుంది.