- దారుణంగా క్షీణించిన శ్రమజీవుల కొనుగోలు శక్తి
- జైరాం రమేశ్ ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలో శ్రమ జీవుల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని, పదేళ్ల కిందట ఉన్న కొనుగోలు స్తోమత కూడా ఇప్పుడు లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం ఆందోళన వ్యక్తం చేవారు. అనేక డేటాలు, సర్వేలు ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వేతనాలు, ఆదాయాల పెరుగుదలలో క్షీణత, ద్రవ్యోల్బణం పెరుగదలలో వృద్ధి కారణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని ఆయన విశ్లేషించారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్ల సమయంలో వ్యవసాయ కార్మికుల వేతనాలు ప్రతీ ఏడాది 6.8 శాతం చొప్పున పెరిగాయని గుర్తు చేశారు. మోడీ ప్రధానిగా గత పదేళ్ల కాలంలో వ్యవసాయ కార్మికల వేతనాలు ప్రతీ ఏడాది 1.3 శాతం చొప్పున తగ్గిపోతూవస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ గణాంకాలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయన్నారు. దేశంలో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు రంగం సిద్ధంగా లేదని అన్నారు. ‘దేశంలో పెట్టుబడులు రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. మన దీర్ఘ కాలిక వృద్ధికి ముప్పు వాటిల్లింది’ అని జైరాం రమేష్ చెప్పారు. యుపిఎ పదేళ్ల కాలంలో జిడిపిలో పెట్టుబడులు 33.4 శాతంగా ఉంటే, మోడీ హయంలోని పదేళ్లలో జిడిపిలో పెట్టుబడులు 28.7 శాతం మాత్రమేనని జైరాం రమేష్ తెలిపారు.