న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదులో ఆలయం ఉన్నట్లు సర్వేలో తేలిందని హిందూ మహిళల తరపు న్యాయవాది విష్ణుజైన్ శుక్రవారం తెలిపారు. వేర్వేరు బాషల్లో 34 శాసనాలతో ఉన్న ఆలయాన్ని మసీదుగా పునర్మించినట్లు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) సర్వేలో పేర్కొన్నట్లు వెల్లడించారు. సర్వే నివేదిక హార్డ్్ కాపీని అందుకున్న అనంతరం మీడియాకు వెల్లడించారు. స్తంభాలు, ప్లాస్టర్స్ అన్నీ ఆలయంలో భాగమేనని చెప్పారని జైన్ అన్నారు.
హిందూ ఆలయానికి సంబంధించిన 34 శాసనాలను గుర్తించారని, ఈ శాసనాలు దేవనాగరి, గ్రంథ్, తెలుగు, కన్నడ భాషలలో ఉన్నాయని, జనార్దన, రుద్ర, ఉమేశ్వర దేవతల పేర్లు శాసనాలలో ఉన్నట్లు తెలిపారు. శిలాశాసనాల్లో మహా ముక్తిమండపం వంటి పదాలు ప్రస్తావించబడ్డాయని, సెల్లార్లను నిర్మించేటపుడు గతంలోని ఆలయం స్తంభాలను తిరిగి వినియోగించినట్లు తేలిందని అన్నారు.
సున్నితమైన కేసు దృష్ట్యా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండటానికి నివేదికను వెంటనే బహిరంగ పరచడానికి లేదా సాఫ్ట్ కాపీలను పంపిణీ చేసేందుకు వారణాసి జిల్లా జడ్జి తొలుత నిరాకరించారు.