న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్సిఎ)ను రద్దు చేసే అవకాశాన్ని పరిశీస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు. జెకె మీడియా గ్రూప్నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, శాంతిభద్రతలను జమ్ముకాశ్మీర్ పోలీసులకే వదిలివేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి సెప్టెంబరులోగా జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. గత ఐదేళ్లలో నకిలీ ఎన్కౌంటర్లేమీ జరగలేదన్నారు. తీవ్రవాదులకు నిధుల అంశంపై 22కు పైగా కేసులు నమోదు చేశామని, రూ.150 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేశామని చెప్పారు.