ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగులకే కాకుండా ఉక్కు నిర్వాసితులకూ తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్ డి ఆదినారాయణ తెలిపారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1137వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఎఐటియుసి అనుబంధ కాంట్రాక్టు కార్మిక సంఘం కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణతోనే కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. స్టీల్ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు 30 ఏళ్లుగా ప్లాంట్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. తమ పిల్లలకైనా న్యాయం జరుగుతుందనే ఆశతో ఎక్కువమంది ఉన్నారన్నారు. ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం ఇప్పుడు వీరిని తీవ్ర ఆందోళన పరుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలను తిప్పికొట్టేందుకు అందరూ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.