ఎస్మాను ఉపసంహరించాలి -సిపిఎం రాష్ట్ర కమిటీ

Jan 6,2024 22:08 #CPM State Committee, #prakatana

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోఅంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. తక్షణమే అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీలను ఎస్మా చట్టపరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుండా సమ్మె నిషేదిస్తూ, సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం దుర్మార్గమని తెలిపారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అభ్యంతరకరమన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తోందని విమర్శించారు. ఇదే వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ చర్యను కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని, అంగన్‌వాడీలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

➡️