కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌.. తీవ్ర తుపానుగా ‘మిచౌంగ్‌’

Dec 4,2023 14:49 #heavy rains, #Tufan
  • నెల్లూరుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం

ప్రజాశక్తి-అమరావతి : నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచౌంగ్‌ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలోనూ, నెల్లూరుకు ఆగేయంగా 170 కి.మీ దూరంలోనూ, మచిలీపట్నానికి దక్షిణంగా 320 కి.మీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది డిసెంబరు 5 మధ్యాహ్నం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపింది.

  • రెడ్‌ అలర్ట్‌

తీవ్ర తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తుపాను తీరం దాటే సమయంలో ఏపీ కోస్తా జిల్లాల్లో ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మిగ్‌ జాం తీవ్ర తుపాను ప్రభావం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలపై అత్యధికంగా ఉంటుందని తెలిపింది.

➡️