– న్యాయం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక
– కలెక్టర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
ప్రజాశక్తి – జంగరెడ్డిగూడెం టౌన్ (పశ్చిమగోదావరి జిల్లా) :దేవరాపల్లి టూ సత్తిపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులు మంగళవారం రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట-పంగిడిగూడెం మధ్యలోని గ్రీన్ఫీల్డ్ హైవే అండర్ పాస్ వద్ద పనులను అడ్డుకున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హైవే పనులు అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినా ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచి ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చి విచారణ పూర్తయినా ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్లు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్లు ఇచ్చి రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. హైవే పనుల వల్ల దుమ్ము ధూళితో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, బోర్లు కోల్పోయిన వారికి వెంటనే జలకళ పథకంలో బోర్లు వేయాలని కోరారు. సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, వాటిని బిటి రోడ్లుగా నిర్మించాలని డిమాండ్ చేశారు. తగినంత ఎత్తులో అండర్ పాస్లు నిర్మించాలని కోరారు. రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టిడిపి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగా రోషన్కుమార్, నేతలు రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్కుమార్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బడ్డు రాంబాబు, గ్రీన్ఫీల్డ్ భూనిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు గోలి నర్సిరెడ్డి, వందనపు సాయిబాబా, పి సోమిరెడ్డి, పి సత్తిరెడ్డి, గూడపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.