విజయవాడ: ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి సీఎం జగన్ మోసం చేశారని తెలుగు యువత వినూత్నంగా నిరసన తెలిపింది. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రవణ్ ఆధ్వర్యంలో.. విజయవాడ శ్మశానవాటికలో జాబ్ క్యాలెండర్కు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత జాబ్ క్యాలెండర్కు సమాధి కట్టి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా నాగశ్రవణ్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా హామీ నిలబెట్టుకోకుండా యువత ఆశలను సమాధి చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ యువతను మభ్యపెట్టారన్నారు. రాష్ట్రంలో గతేడాది దాదాపు 8వేల మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 364 మంది నిరుద్యోగులేనని తెలిపారు. సగటున రోజుకో నిరుద్యోగి.. ప్రభుత్వ తీరుతో ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/10-8.jpg)