- చదలవాడకు టికెట్ కేటాయించాలని డిమాండ్
ప్రజాశక్తి-పల్నాడు : చదలవాడకు నరసరావుపేట టికెట్ కేటాయించాలని టిడిపి నేత నరసరావుపేట మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ పులిమి వెంకట రామిరెడ్డి పురుగు మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి జంగా కృష్ణ మూర్తి, గజ్జల బ్రహ్మారెడ్డి, తాజాగా మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్ కోడెల శివరాం ఎవరో ఒకరికి కట్టబెట్టాలని అధిష్టానం ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నరసరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన టిడిపి నేత పులిమి రామిరెడ్డి నరసరావుపేట టిక్కెట్ డాక్టర్ చదలవాడకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పురుగు మందు సేవించారు. డాక్టర్ చదలవాడకు కాకుండా వేరే అభ్యర్థికి టిడిపి టికెట్ కేటాయించేందుకు టిడిపి ఎంపి అభ్యర్థి లావు శ్రీకష్ణ దేవరాయలు ప్రయత్నం చేస్తున్నారని దీనిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. స్పందించిన కుటుంబ సభ్యులు టిడిపి నాయకులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.