అమరావతి : విజయవాడలోని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ రాకపై వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాలపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. మంగళవారం ఓ కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. కంటైనర్లో ఏముందంటూ నారా లోకేష్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకే డబ్బులను తరలిస్తున్నారని ఆరోపించారు.
కంటైనర్లో వచ్చింది బ్రెజిల్ సరుకా? మద్యంలో మెక్కిన వేలకోట్లా, లండన్ పరారీకి ఏర్పాట్లా ? ఏపీ సెక్రటేరియట్ దాచిన దొంట ఫైళ్లా? అంటూ చేసిన ఆరోపణలపై వైవీ స్పందించారు. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, టీడీపీ నాయకులకు ఏ కంటైనర్ చూసినా డ్రగ్స్ కంటైనరే గుర్తొస్తుందని విమర్శించారు.
విశాఖ నదీతీరంలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో టీడీపీ నేతల బంధువులే ఉన్నారని పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయాంలో ఉండే ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ను తీసుకెళ్లారని వెల్లడించారు. లోకేష్ చట్ట సభలకు ఎన్నికలైన వ్యక్తి కాదని దొడ్డిదారిన మంత్రి అయి అవగాహన లేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.