పార్లమెంటులో నిలదీయండి

Dec 20,2023 09:20 #cpm

– విశాఖ బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ప్రైవేటీకరణపై ఎంపిలకు సిపిఎం లేఖ

-పోలవరం నిధులనూ రాబట్టేలా చూడాలి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో’విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అంటూ 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడానికి గత మూడేళ్లకు పైబడి కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని, దీన్ని అడ్డుకోవాలని రాష్ట్రానికి చెందిన ఎంపిలందరికీ లేఖ రాసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఆ లేఖను మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, మంతెన సీతారాంతో కలిసి మీడియాకు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల అండతో కార్మికులు పోరాడి ఇప్పటి వరకు స్టీలు ప్లాంటును నిలబెట్టారని తెలిపారు. కేంద్రం ఇప్పుడు ప్రైవేటుపరం చేయడానికి కొత్త మార్గాలు వెతుకుతోందని, ఉత్పత్తికి కీలకమైన బ్లాస్ట్‌ ఫర్నెస్‌ా3 పని చేసేందకు సుమారు రూ.1,200 కోట్లు అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ నిధులను మంజూరు చేయడమో లేక అప్పు తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడమో మాని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించాలని కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు. జిందాల్‌ స్టీల్‌ యాజమాన్యంతో ఉన్నతాధికారులు గతవారంలో ఢిల్లీలో చర్చించినట్లు వచ్చిన వార్తలతో స్టీల్‌ప్లాంట్‌ కార్మికవర్గం తీవ్ర ఆందోళన చెందుతోందని వివరించారు. ఇప్పటికైనా బ్లాస్ట్‌ ఫర్నెస్‌ా3 పనిచేయించేందుకు నిధులు కేటాయించాలని, నిర్వహణ బాధ్యత సెయిల్‌కు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వారిని విశాఖస్టీల్‌ ప్లాంట్‌లోనికి అనుమతించరాదని కోరారు. పోలవరం నిధులనూ రాబట్టాలి పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్షలాది కుటుంబాలు ముఖ్యంగా అత్యధిక గిరిజన కుటుంబాలు నిర్వాసితులవుతున్నారని, వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం, పునరావాస పునర్నిర్మాణ సౌకర్యాల కల్పన కోసం ఇంకా దాదాపు 33 వేల కోట్ల రూపాయలు సమకూర్చవలసి ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధులను విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని తెలిపారు. ముంపు ప్రాంతాలు పేరిట ఆయా గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులను సైతం కల్పించడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయని చెప్పారు. చివరికి ఇటీవల సంభవించిన తుపాను వల్ల జరిగిన నష్టపరిహారాన్ని కూడా ఎన్యుమరేషన్‌ చేయలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసిత ప్రజానీకానికి చెల్లించవలసిన నష్టపరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్రయోజనాల కల్పనకు కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు పార్లమెంటు సభ్యులందరూ సమస్యను ఈ సెషన్‌లోనే లేవనెత్తి వారికి న్యాయం చేసేందుకు కృషి చేయాలని కోరారు.

➡️