ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ):కెఎస్ఇజడ్ లైపిజ్ ఫార్మా పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్లైన్ తొలగించాలని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ కోనపాపపేట బీచ్ రోడ్డులో గురువారం ధర్నా చేశారు. పార్టీలకతీతంగా బీచ్ రోడ్డుపై బైఠాయించారు. పైప్లైన్ సముద్రంలోకి వేయడంతో మత్స్య సంపద నష్టపోతోందని, బోట్లు పాడైపోయి, వలలు చిరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పైపులైన్ తొలగించాలని డిమాండ్ చేశారు. పిఠాపురం సిఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని మత్స్యకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పైపులైను తొలగిస్తేనే తాము ఆందోళన విరమిస్తామని మత్స్యకారులు తేల్చి చెప్పి ధర్నాను కొనసాగించారు.