– హెచ్ఎంఎస్ స్టీల్ప్లాంట్ విభాగం అధ్యక్షులు అప్పారావు
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం):విశాఖ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ చర్యలను ఆపకుంటే కేంద్రంలోని బిజెపికి రానున్న కాలంలో ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారని హెచ్ఎంఎస్ స్టీల్ప్లాంట్ విభాగం అధ్యక్షులు డి.అప్పారావు హెచ్చరించారు. స్టీల్ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 1087వ రోజుకు చేరాయి. దీక్షనుద్దేశించి అప్పారావు మాట్లాడుతూ మూడేళ్లకుపైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కు పరిరక్షణ ఉద్యమం సాగుతున్నప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మోడీకి మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా పునరాలోచన చేయాలని హితవుపలికారు. దీక్షల్లో నాయకులు ఒనుము అప్పలరాజు, ద్వారపూడి ఈశ్వరరావు, డి.కనకరాజు, గొందేసి సత్యారావు, బత్తిన పెంటయ్య పాల్గొన్నారు.