– రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా
ప్రజాశక్తి-కడపకడప నగరంలోని మరియాపురం సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ గురువారం జరిగింది. రెండు రోజులపాటు జరుగనున్న ఈ సైన్స్ ఫెయిర్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 234 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత సైన్స్ ఫెయిర్ను ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్బాషా ప్రారంభించి మాట్లాడుతూ… మన ఆలోచనలే.. మన ఆవిష్కరణలని, ఆటవిక జీవనం నుండి పరిణమించిన మానవిక వికాసమే విజ్ఞానమని అన్నారు. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ను కడపలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషమన్నారు. భవిష్యత్ తరాలన్నీ సైన్స్ పైనే ఆధారపడి ఉన్నాయని, పూర్వ శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని ఈ ప్రదర్శనకు వచ్చిన విద్యార్థుల ఆవిష్కరణలను అభినందించాలని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవి.రామచంద్రారెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎస్సిఇఆర్టి ప్రతాప్రెడ్డి, డిఇఒ రాఘవరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మహేశ్వరరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజం, తదితరులు పాల్గొన్నారు.