హైదరాబాద్ : మార్చి ఒకటి నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. దాదాపుగా 150 – 200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కాళేశ్వరం వెళ్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేస్తున్న వారికి చూపిస్తామన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే మేడిగడ్డకు వెళ్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం అంటే ఏంటో సజీవంగా చూపిస్తామన్నారు. విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/5-46.jpg)