– సిఐటియు నాయకుల సహా పలువురు అరెస్టు
– డిసిఎల్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యోగులు
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :తమ సమస్యలపై పోరాడుతున్న మిమ్స్ (మహారాజా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ఉద్యోగులపైనా, వారికి అండగా నిలిచిన సిఐటియు నాయకులపైనా పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. 16 మందిని అరెస్టు చేసి నెల్లిమర్ల, డెంకాడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇద్దరిని గృహనిర్బంధంలో ఉంచారు. జనవరి నెల వేతనం, బకాయి ఉన్న ఏడు డిఎలు చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ గత 24 రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో మిమ్స్ ఉద్యోగులు పోరాడుతున్నారు. అయినా, కార్మిక శాఖాధికారులు చర్చలు ఏర్పాటు చేయకపోవడం, యాజమాన్యానికి కొమ్ము కాయడంతో శనివారం డిసిఎల్ కార్యాలయ ముట్టడి తలపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు సిఐటియు నాయకులతోపాటు మిమ్స్ ఉద్యోగుల ఇళ్లను తెల్లవారుజామున నాలుగు గంటలకే చుట్టుముట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. తనకు ఆరోగ్య బాగోలేదని చెప్పడంతో గృహనిర్బంధంలో ఉంచారు. ఉదయం పది గంటల సమయంలో కార్యకర్తలతో జరగాల్సిన అత్యవసర సమావేశంలో పాల్గనేందుకు తోటపాలెంలోని కార్యాలయానికి బయలుదేరిన ఆయనను వెంబడించారు. పార్టీ కార్యాలయంలోకి చొరబడి మరీ తమ్మినేనిని అరెస్టు చేసి జీపులో స్టేషన్కు తరలించారు. సిఐటియు రాష్ట్ర నాయకులు టివి రమణను ఇంటి నుంచి బయటకు రానీయలేదు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్ను గృహనిర్బంధంలో ఉంచారు. నిరసన కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న మిమ్స్ ఉద్యోగులను దొరికిన వారిని దొరికినట్టు ఇళ్ల వద్ద, బయట అరెస్టు చేసి డెంకాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినప్పటికీ మిగతా ఉద్యోగులంతా డిసిఎల్ కార్యాలయం వద్దకు చేరుకొని బైఠాయించారు. అధికారులు స్పందించి తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.