కరీంనగర్: వీణవంక మండలం భేతిగల్కు చెందిన కుర్ర సురేష్ బుధవారం ఇంట్లో గొడవపడి తన పొలానికి వచ్చాడు. జీవితంపై విసుగుచెందిన రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. అక్కడున్నవారు గమనించి 100కు సమాచారం అందించగా.. వెంటనే బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హౌంగార్డు కిన్నెర సంపత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అంబులెన్స్ కు కాల్ చేసి అది వచ్చి తీసుకునే వెళ్లే సరికి రైతు ప్రాణాలు మిగలవని భావించి.. వెంటనే కానిస్టేబుల్ జయపాల్ అతడిని భుజాన వేసుకుని పొలాల మీదుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సాయంతో జమ్మికుంట ఆస్పత్రికి తరలించారు. రైతు సురేష్ కు వైద్యులు వెంటనే వైద్యం అందించారు. ప్రస్తుతం సురేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సకాలంలో సురేష్ ను కాపాడిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్, ఇతర సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/7-35.jpg)