ప్రజాశక్తి-అమరావతి : ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని.. గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తించారు. ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైసిపి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను టిడిపి సమర్ధించదన్నారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి.. చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని తెలిపారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారని.. వారి భవిష్యత్ను వారే పాడు చేసుకుంటున్నారని అన్నారు. జగన్ అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే జైలుకు వెళ్లినా పట్టించుకోలేదని.. అలాంటిది వాలంటీర్లపై కేసులు పడితే పట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. ఒక్క సారి కేసు పడితే వారి భవిష్యత్ అంథకారమేనని వాలంటీర్లు గ్రహించాలన్నారు. అందుకే వాలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కోరారు.
![atchannaidu on amaravati protest 1500days](https://prajasakti.com/wp-content/uploads/2024/01/atchannaidu-on-amaravati-protest-1500days.jpg)