వైఎస్‌ షర్మిల వెంటే నడుస్తా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా)వైఎస్‌ షర్మిల వెంట తాను నడుస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల వైసిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు. తాను వైఎస్‌ఆర్‌ కుటుంబానికి సన్నిహితుడునన్నారు. వైఎస్‌ షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని, ఇప్పటికే ఆమెను కలిశానని చెప్పారు. వైసిపికి సిద్ధాంతాలు లేవని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,200 కోట్లు మంజూరు చేసిందని, అయితే, రూ.120 కోట్లు మాత్రమే విడుదల చేసిందని తెలిపారు. కాంట్రాక్టర్‌ బిల్లుల విషయంలో అనేక పర్యాయాలు సిఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో తాను కోటి రూపాయలు అప్పు తెచ్చి చెల్లించానన్నారు. ఎవరు తప్పు చేసినా కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని, చంద్రబాబుపై తాను పెట్టిన కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తానని చెప్పారు.

➡️