– కేంద్ర టెలీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్సిన్హ్ చౌహన్
ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) :కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో సమగ్ర ప్రణాళికలను తయారు చేసుకుని గ్రామాలు అభివృద్ధి చెందేలా ముందుకు సాగాలని కేంద్ర టెలీకమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్సిన్హ్ చౌహన్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరాలని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం తెచ్చేలా అధికారులు ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలన్నింటినీ ప్రజలు వినియోగించుకొని అభివఅద్ధి చెందాలని సూచించారు. అనంతరం డిఆర్డిఎ ఆధ్వర్యంలో రూ.3.60 కోట్ల చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతిభ కనబరిచిన వారిని, క్రీడాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్కలెక్టర్ భరత్, వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ ఎ.రమణ రెడ్డి, సర్పంచ్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.