అనంతపురం : సీఎం జగన్ రాప్తాడు పర్యటనను నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆందోళనకు దిగింది. అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఎం జగన్ గో బ్యాక్ ప్లకార్డులు పట్టుకుని తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నేతలు నిరసనకు దిగారు. రాష్ట్రంలో నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని రాప్తాడు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ విడుదల చేశారని మండిపడ్డారు. మహిళలకు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. సీఎం జగన్కు ఏ మాత్రం మాట మీద నిలబడేతత్వం ఉంటే రాప్తాడు సభకు రాకూడదన్నారు. కచ్చితంగా సీఎం జగన్ను సిద్ధం సభకు రాకుండా అడ్డుకుంటామని టీఎన్ఎస్ఎఫ్ నేతలు హెచ్చరించారు.