ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం): ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యాన బుధవారం భువనేశ్వర్లో నిర్వహించిన 68వ రైల్వే వీక్ అవార్డుల కార్యక్రమంలో వాల్తేర్ డివిజన్ బృందం ఐదు సమర్థతా అవార్డులను సాధించింది. వాల్తేరు డివిజన్ 2023లో ‘బెస్ట్ క్లీన్ స్టేషన్ (మేజర్ స్టేషన్ కేటగిరీ), ఎలక్ట్రికల్, సిగల్ అండ్ టెలికాం, ఖుర్దా రోడ్తో ఆపరేటింగ్ అండ్ సర్వే, కన్స్ట్రక్షన్ సహా వివిధ రంగాలలో అందించిన ఉత్తమ పనితీరుకు ఐదు సమర్థతా షీల్డ్లను అందుకుంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన 35 మంది ఉద్యోగులు, రెండు గ్రూపులకు, ముగ్గురు అధికారులకు మెరిట్ అవార్డులు, షీల్డులను అందజేశారు. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ ఆయా శాఖల అధికారులతో కలిసి షీల్డ్లను అందుకున్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్శర్మ మాట్లాడుతూ 2022-23లో అత్యధిక లోడింగ్ జోన్గా ఆవిర్భవించి భారతీయ రైల్వేలో చరిత్ర సృష్టించేందుకు అనేక మైలురాళ్లను అధిగమించడంలో దోహదపడిన ఉద్యోగులను అభినందించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/20-8.jpg)