ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : అక్రమంగా ఇంట్లో గంజాయి నిల్వ చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటవ అదనపు జిల్లా జడ్జి సిహెచ్.రాజగోపాలరావు సోమవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సత్తెనపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం.రమేష్, ఎస్సై కె.రవికుమార్ 2017 నవంబర్ 22న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం శాంతిపాలెంకు చెందిన రామచంద్రపు బుల్లియ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక గోనె సంచిలో 21 కిలోల 100 గ్రాముల గంజాయి దొరికింది. బుల్లియ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు అయ్యింది.