ప్రజాశక్తి-అనకాపల్లి :జగన్ సర్కారు వల్ల రాష్ట్రంలో వ్యవసాయరంగం కుదేలైందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో తనను కలిసిన గంగాదేవి పేట రైతులతో లోకేష్ మాట్లాడారు. రైతాంగ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా.. టీడీపీ అధికారంలోకి రాగానే అన్నదాతకు అండగా నిలుస్తామనిి హామీ ఇచ్చారు. శారద కాలువ పూడిక తీయిస్తామన్నారు. అనంతరం మునగపాకలో అంగన్ వాడీలు ధర్నా శిభిరాన్ని సందర్శించారు. అంగన్ వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవని, వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సిందిపోయి అంగన్ వాడీలను జగన్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని విమర్శించారు. ఇది ఆయన నియంతత్వ పోకడకు నిదర్శనమని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్ వాడీల న్యాయమైన కోరికలను తీరుస్తామని లోకేశ్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.