ప్రజాశక్తి-విజయనగరంటౌన్ :అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను బుధవారం విజయనగరం కలెక్టరేట్లో కలిసి వినతి పత్రం అందజేశారు. సమాజంలో గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. 42 రోజుల సమ్మె ముగింపు సందర్భంగా మినిట్స్ కాపీలో పొందుపర్చిన అన్ని సమస్యలనూ పరిష్కరించాలని, పెండింగ్ జిఒలు ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుమారి, ఎస్.అనసూయ, నాయకులు ఉన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/4-60.jpg)