ప్యాంట్రీకార్‌పై దుష్ప్రచారం

– బిజెపి అభ్యర్థులందరూ చంద్రబాబు మనుషులే
– సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు అన్ని అనుమతులూ వున్న ప్యాంట్రీకార్‌పై అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడటం టిడిపికి అలవాటేనని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెన్షన్‌ వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గించడం, రూ.4 వేలు చంద్రబాబు ఇస్తామనడం అంతా అబద్ధమని అన్నారు. సిఎం కార్యాలయానికి వచ్చిన కంటెయినర్‌ ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఎపిఎస్‌ఆర్‌టిసి నుంచి నిబంధనల మేరకు లీజుకు తీసుకున్నామన్నారు. ఈ ప్యాంట్రీ కార్‌కు ఇసి అనుమతి కూడా వుందని తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌ ట్విట్టర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. బిజెపితో పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలను చేసిన అంశాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే బిజెపి దగ్గర సాగిలపడ్డారని విమర్శించారు. నరసాపురం పార్లమెంటు సీటు మినహా బిజెపిలో ఉన్న చంద్రబాబు మనుషులకే టికెట్లు ఇచ్చారని అన్నారు. బిజెపిలో వున్న టిడిపి ఏజెంట్లు ఇప్పుడు బిజెపిని నడిపిస్తున్నారని విమర్శించారు.

➡️