Bapatla District బాలికపై సామూహిక అత్యాచారం

Jun 30,2024 10:46 #bapatla, #Gang Rape

ప్రజాశక్తి- రేపల్లె (బాపట్ల జిల్లా) : బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిజాంపట్నం మండలం సజ్జవారిపాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రేపల్లె డిఎస్‌పి మురళీకృష్ణ కథనం ప్రకారం… సజ్జవారిపాలేనికి చెందిన ఒక బాలిక పదో తరగతి తప్పడంతో ఇంటి వద్దే ఉంటోంది. తన బంధువుల ఊరైన వేమూరు మండలం పెరవలికి వెళ్లినప్పుడు అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలుడు పి.చైతన్యతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తరచూ వారు ఫోన్లో మాట్లాడుకొనేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో బాలికకు ఆ బాలుడు ఫోన్‌ చేసి ఊరు చివరకు రావాలని చెప్పాడు. దీంతో, అక్కడికి వెళ్లిన ఆ బాలికను పొలాల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే చైతన్య స్నేహితులు జొన్నకూటి వెంకటేష్‌, వీరంకి సతీష్‌, వీరంకి వేణు, ఎడాలి పవన్‌కుమార్‌ (మైనర్‌) అక్కడ ఉన్నారు. వారు ఐదుగురు బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఆ బాలిక ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రేపల్లె డిఎస్‌పి మురళీకృష్ణ తెలిపారు. రూరల్‌ సిఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశామని, నిందితులపై పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. అత్యాచారం కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకున్న పోలీసు సిబ్బందిని డిఎస్‌పి అభినందించారు.

➡️