‘తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారు’ : బొండా ఉమా

Apr 20,2024 10:52 #Bonda Uma, #Pressmeet

విజయవాడ: తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టిడిపి నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద మంది పోలీసులు శుక్రవారం తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సీపీ తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్‌ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్‌లో ఉన్న వేముల సతీష్‌ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని బొండా ఉమా తెలిపారు.
”డీజీపీ, సీపీ, ఏసీపీ అంతా సిండికేట్‌గా ఏర్పడి టిడిపి అభ్యర్థులపై వేధింపులకు కుట్ర పన్నారు. నేరగాడి చేతిలో కీలుబమ్మలా పోలీసులు మారిపోవడం దుర్మార్గం. గులక రాయి దాడి కేసు నిందితుడు వేముల సతీష్‌ తల్లిదండ్రులను రెండు రోజుల నుంచి వేధిస్తున్నారు. వడ్డెర గూడెంలో ఉండటమే వేముల దుర్గారావు పాపమా? ఏ సంబంధం లేని అతడిని తీసుకెళ్లి ఎక్కడ దాచారో తెలియదు. తప్పుడు కేసు అంగీకరించాలని అతడితోపాటు మహిళలను చిత్రహింసలు పెడుతున్నారు. గులకరాయి దాడిపై సీబీఐ విచారణ జరపాలని మొదటిరోజే లేఖ రాశాం. ఆరు రోజుల నుంచి దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదు? మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు. నా కోసం మొత్తం వడ్డెరగూడేన్ని ఇబ్బంది పెడతారా? తప్పులు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు” అని బొండా ఉమా హెచ్చరించారు.

➡️