మృతుడు ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు
ప్రజాశక్తి తుగ్గలి కర్నూలు జిల్లా :తుగ్గలి మండలం పెండేకల్ రైల్వే జంక్షన్లో శనివారం రాత్రి మాజీ మావోయిస్టు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైసిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు మాజీ మావోయిస్తు పూజారి రాము (59) 1985 నుండి 1991 వరకు నల్లమల ఫారెస్ట్లో బోనాసి దళం కమాండర్గా పనిచేశారు. ఆర్ఎస్యు జిల్లా అధ్యక్షులుగానూ ఉన్నారు. ఆయన మానసిక పరిస్థితి సక్రమంగా లేక మతిస్థిమితం కోల్పోయి పెండేకల్ రైల్వే జంక్షన్లోనే ఉండేవారు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను దారుణంగా హత్య చేశారు. ఈ హత్యపై తుగ్గలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాము తమ్ముడు, ఉద్యమకారుడు పూజారి లెనిన్ బాబు మాట్లాడుతూ తమ అన్నను ఎవరో హత్య చేయడం చాలా బాధాకరమన్నారు. ఆదివారం సాయంత్రం సొంతూరు ఆర్ఎస్ పెండేకల్లులో అంత్యక్రియలు నిర్వహించారు. వీటికి ఎమ్మెల్సీ పోతుల సునీత ఆమె భర్త సురేష్ హాజరయ్యారు. గతంలోనూ అదే స్థలంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.