హైదరాబాద్ : అసెంబ్లీలో కాగ్ నివేదికను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టులో పలు సంచలన విషయాలను కాగ్ వెల్లడించింది. ”కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది. రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని.. దీంతో రూ.765కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించింది. డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారు. అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల రూ.25వేల కోట్లు అదనంగా ఖర్చయింది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51శాతంగా అంచనా వేశారు.. కానీ అది 0.75 శాతంగా తేలుతోంది. అది మరింత తగ్గే అవకాశముంది. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారు” అని నివేదికలో కాగ్ పేర్కొంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/cag-1.jpg)