- పొత్తు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం జనసేన అధినేత పవన ్కళ్యాణ్తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ మేరకు ఇరుపార్టీలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాయి. ‘జనసేన అధ్యక్షులు పవన్ నివాసానికి టిడిపి అధినేత చంద్రబాబు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, తాజా పరిస్థితులుపై చర్చించారు’ అని టిడిపి పోస్టు చేసింది. చంద్రబాబు, పవన్ మధ్య సుదీర్ఘంగా చర్చలు సాగాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇరుపార్టీల మధ్య పొత్తు పటిష్టత గురించి, ఉమ్మడి మేనిఫెస్టోపై సమాలోచనలు జరిపారని, ఏపిలో తాజా రాజకీయ పరిస్థితులు, వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ఆయన నివాసానికి వెళ్లి భేటీ కావడం విశేషం.