ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో కోడి పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పిలు తగిన చర్యలు తీసుకోవాలని తీర్పు చెప్పింది. జంతు నిరోధక, జూద నిరోధక చట్టాలను అమలు చేసి తీరాలని తేల్చి చెప్పింది. తమ ఆదేశాలను పట్టించుకోకపోతే, చర్యలు తీసుకోని సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసి తీరాలని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రావు రఘునందన్రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు జరక్కుండా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కృష్ణా జిల్లాకు చెందిన హనుమ అయ్యప్ప దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణ జరిపింది. కోడి పందేల బరులను ఏర్పాటు దశలోనే అడ్డుకోవాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.