ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మిడ్డే మీల్స్ కార్మికులను, ఆయాలను అకారణంగా రాజకీయ వేధింపులతో తొలగిస్తున్నారని, తక్షణం ఈ తొలగింపు ప్రక్రియను నిలిపివేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. రాష్ట్రంలో 200 మందిని ఇలాగే తొలగించారని తెలిపింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోయినా చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతూ మిడ్డే మీల్స్ పథకాన్ని అమలు చేస్తున్న వారిని అకారణంగా తొలగించి తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని పెడుతున్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో మిడ్డే మీల్స్ కార్మికులను పనులు చేసుకోనివ్వకుండా వంటపాత్రలను బయటకు విసిరేసి రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని రాజకీయ కక్షసాధింపు చర్యలను మిడ్డే మీల్స్ కార్మికులపై వేధింపులను ఆపాలని కోరారు.
![నేడు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం](https://prajasakti.com/wp-content/uploads/2024/05/citucitu.jpg)