పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన – సిఎం చంద్రబాబు అసంతృప్తి

రాయచోటి (అన్నమయ్య) : ఎపి రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో ఆమె మాట్లాడిన తీరును సిఎం తప్పుబట్టారు. మంత్రి రామ్‌ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి.. ఇలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారు. రాయచోటిలో పోలీసులు తనకూ ఎస్కార్ట్‌గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో పింఛన్ల పంపిణీకి బయలుదేరిన ఆమె, ఇటీవల ఎన్నికల ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల ఎస్కార్ట్‌ కోసం వేచి చూశారు. రాయచోటి ఎస్సై అరగంట తర్వాత అక్కడికి రావడంతో ఎంతసేపు నిరీక్షించాలంటూ హరిత అసహనం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్‌ ఉందని చెప్పడంతో సీఐకి లేని కాన్ఫరెన్స్‌ మీకెందుకని అసహనం వ్యక్తం చేశారు. మీకు జీతం ప్రభుత్వం ఇస్తుందా లేక వైసిపి నాయకులు ఇస్తున్నారా అని హరితా ఎస్‌ఐని నిలదీశారు. సారీ చెప్పడంతో ఎందుకు సారీ అంటూ విసుక్కున్నారు. అనంతరం ఆమె పింఛన్ల పంపిణీకి చిన్నమండెం మండలానికి వెళ్లారు. మంత్రి భార్య అసహనం వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీనిపై వెంటనే మంత్రి కార్యాలయం స్పందించింది పోలీసులు ఆలస్యంగా రావడం వల్లే మంత్రి భార్య అసహనం వ్యక్తం చేశారని, ఏమైనా గొడవలు జరుగుతాయని కారణంతోనే ఎస్కార్ట్‌ కోసం మంత్రి భార్య వేచి చూశారని వివరణ ఇచ్చారు.

➡️