విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు నామినేషన్ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. సింగ్ నగర్ పైపుల్ రోడ్డు నుండి ఎంబి విజ్ఞాన కేంద్రం రాఘవయ్య పార్కు వరకు భారీ ర్యాలీ కొనసాగింది. నగరమంతా ఎర్రజెండాలతో రెపరెపలాడాయి. సిపిఎం సిహెచ్.బాబురావును గెలిపిద్దాం విజయవాడను మారుద్దాం.. అని నినదించారు. కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ, సిపిఐ ఎంఎల్ లేబరేషన్ ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావుని గెలిపించాలని భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. సిపిఎం సిహెచ్ బాబురావుకు మద్దతుగా భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ …. సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావుని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సింగ్నగర్, పాయికాపురం, రాజీవ్నగర్, వాంబే కాలనీ, అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాయి అంటే కమ్యూనిస్టుల కృషి అని కొనియాడారు. విజయవాడ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ సిహెచ్ బాబురావు ఎంతో కృషి చేశారని చెప్పారు. దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బిజెపి దానికి మద్దతు తెలుపుతున్న టిడిపి వైసిపిలను ఓడించాలని అన్నారు. విజయవాడ అభివృద్ధికి నోచుకోకుండా చేసిన బిజెపి, తెలుగుదేశం పార్టీలను ఓడించాలని రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీని బిజెపికి మద్దతు తెలుపుతున్న పార్టీలను ఓడించాలని, రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. విజయవాడ అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి పార్టీల ద్వారా జరుగుతుందని, దానిలో భాగంగా ఇండియా కూటమి పార్టీలు ఐక్యంగా పోరాడి సెంట్రల్ సిటీలో సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డె శోభనాద్రీశ్వరరావు, సిపిఎం మాజీ రాష్ర్ట కార్యదర్శి పి.మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు వి.గురునాథం, ఆప్ జిల్లా నాయకులు పరమేశ్వరరావు, లిబరేషన్ నాయకులు డి.హరినాథ్, ఆర్జెడి నాయకులు ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణా, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి విచ్చేశారు.