ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి తహసిల్దార్ ఎస్.రమణయ్య దారుణ హత్యను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రత్యేకించి విశాఖపట్నం కేంద్రంగా ఇటీవల కాలంలో చెలరేగిపోతున్న ల్యాండ్ మాఫియా ఆగడాలకు ఇది ప్రత్యక్ష తార్కాణమని పేర్కొంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన దోషులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది. రమణయ్య మృతికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు విశాఖతో సహా మరికొన్ని జిల్లాల్లో వెలుగుచూశాయని తెలిపింది. ప్రభుత్వం మందకొడితనం వల్ల ఈ శక్తులు ఇంకా పేట్రేగిపోతున్నాయని విమర్శించింది. ల్యాండ్ మాఫీయాను అరికట్టి విశాఖ, విజయనగరం దాని పరిసర ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడాలని కోరింది.