ప్రజాశక్తి-ప్రకాశం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి (94) శనివారం సాయంత్రం హైదరాబాద్ బర్కత్పురాలోని సిసి షరాఫ్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లిలో ఆదివారం అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు, అనేకమంది గ్రామస్తులు వెంకటస్వామికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను పలువురు మననం చేసుకున్నారు.
గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న వెంకటస్వామి హైదరాబాద్లోని తన మనుమరాలి వద్ద ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయనకు ఒక కుమారుడు, అయిదుగురు కుమార్తెలు ఉన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పిలుపులో భాగంగా హెల్త్ వలంటీరుగా నెల్లూరులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని ప్రజావైద్యశాలలో వెంకటస్వామి తర్ఫీదు పొందారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఆర్ఎంపిగా పాసయ్యారు. వ్యవసాయం చేస్తూనే, కెల్లంపల్లి గ్రామంలో ఏడు దశాబ్దాల పాటు ప్రజలకు వైద్య సేవలందించారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా పని చేశారు. కెల్లంపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు.
అంత్యక్రియల నిమిత్తం వెంకటస్వామి మృతదేహాన్నిఆదివారం ప్రకాశం జిల్లా కెల్లంపల్లికి తరలించారు.
కెల్లంపల్లి చేరుకున్న వెంకటస్వామి మృతదేహానికి నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా పార్టీ బృందం
తెలంగాణ బ్యూరో : వెంకటస్వామి భౌతికకాయానికి సిపిఎం తెలంగాణ నాయకులు ఎస్ వీరయ్య, వెంకట్రాములు, నవతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ పి ప్రభాకర్, సిపిఎం హైదరాబాద్ నగర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కిరణ్చంద్ర, అబ్బాస్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.