KTR – ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు – కెటిఆర్‌ ఆగ్రహం

తెలంగాణ : హుజురాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయటాన్ని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా ? అని  ప్రశ్నించారు.  ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్‌ రెడ్డి చేసిన నేరమా ? అని అడిగారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతోపాటు తరగతి గదుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పనపైన మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించటం తప్పా అని ప్రశ్నించారు. ఈ సమావేశానికి ఎందుకు హాజరయ్యారంటూ మండల విద్యాధికారులకు డీఈవో అక్రమంగా నోటీసులు ఇవ్వటమేమిటన్నారు. ప్రభుత్వాధికారి అయిన డీఈఓ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలాగా వ్యవహారిస్తున్నారని కౌశిక్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇదే అంశాన్ని జడ్పీ సమావేశంలో లేవనెత్తారని కెటిఆర్‌ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాల మేరకు సమావేశం నిర్వహించటానికి కూడా కౌశిక్‌ రెడ్డికి హక్కు లేదా ? అని ప్రశ్నించారు. దళిత బంధు చెక్కుల పంపిణీతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్‌ కిట్టు, న్యూట్రిషన్‌ కిట్టు ఇవ్వడంతోపాటు మహిళల కోసం అదనంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ కు పోస్టింగ్‌ ఇవ్వాలని తమ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ అడిగారని ఇది కూడా నేరమేనా అని కెటిఆర్‌ మండిపడ్డారు. జడ్పీ సమావేశంలో కలెక్టర్‌ పట్టించుకోకపోవటంతో కౌశిక్‌ రెడ్డి నిరసన తెలిపే ప్రయత్నం చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధికే నిరసన తెలిపే హక్కు లేదా ? అని కెటిఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులకు తెరతీస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారని కెటిఆర్‌ అన్నారు. కౌశిక్‌ రెడ్డిపై అక్రమ కేసు బనాయించటం దుర్మార్గ పూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కౌశిక్‌ రెడ్డి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పెద్దల అవినీతి బాగోతం, అక్రమాలను బయటికి తెస్తున్నారనీ…. అందుకే కేసుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసున్నారని కెటిఆర్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రశ్నించే మీడియా, ప్రజాప్రతినిధులపై, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కెటిఆర్‌ విమర్శించారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని కెటిఆర్‌ ప్రశ్నించారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే బిఆర్‌ఎస్‌ ప్రజా గొంతుకగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇప్పటికైనా ప్రతీకార చర్యలు మాని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని కెటిఆర్‌ సూచించారు.

➡️