హైదరాబాద్: లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలన్నారు.
గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తమ్మినేని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వీరభద్రం చికిత్సకు స్పందిస్తున్నారని, మౌఖికంగా ఇచ్చే సూచనలను అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం 24 గంటలపాటు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు. మంత్రులతో పాటు మునుగోడు ఎమ్మేల్యే రాజుగోపాల్ రెడ్డి, ఖమ్మం జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు పరామర్శించారు.