విజయవాడ : విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ గుంటూరు బాపనయ్యనగర్లో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి ప్రజా రచయిత, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానాట్యమండలి నాయకులు కె.దేవేంద్ర లక్ష రూపాయల విరాళం అందించారు. శుక్రవారం విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతున్న ప్రజా సంస్కృతి రాష్ట్ర వర్కుషాపులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ విరాళాన్ని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డిలకు అందించారు. ప్రజా కళారూపాల సృష్టికి ప్రజానాట్యమండలి కార్యాలయం కేంద్రంగా ఉపయోగపడాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో నిర్మితమవుతున్న రాష్ట్ర కార్యాలయం కోసం విరాళాన్ని అందించిన దేవేంద్రకు పలువురు సాహితీ, సాంస్కృతిక కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ, ఎం.బి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.