ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించాలి : ఎపి వ్య.కా.సంఘం

దేవరాపల్లి (అనకాపల్లి) : ఉపాధి హామీ పధకంలో పనిచేస్తున్న కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలని, 2024 బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయింపులు చేయాలని, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బిటి.దొర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బుధవారం దేవరాపల్లి మండలంలోని తామారబ్బ దేవరాపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తున్న చోటకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోని నిరసన తెలిసిన అనంతరం వారు మాట్లాడారు. జిల్లాలోని గత సంవత్సరం వంద రోజులు పనులు పూర్తి అవ్వని కూలీలు ఈ సంవత్సరం ఆరువారాల నుండి పనులు చేస్తున్నారని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఏడు వందలు కోట్లు రూపాయలు బకాయిలు ఉన్నాయని, వీటిని సకాలంలో చెల్లించక పండగ రోజుల్లో కూడా పస్తులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం చేసిన పనులకు కూడా నేటి వరకు బిల్లులు చెల్లించలేదని వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంవత్సరం ఉపాధి చట్టానికి బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాలని, ఆధార అనుసంధానం నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని రెండు వందల రోజులు పని రోజుకి ఆరు వందలు కూలి ఇవ్వాలని, సమ్మర్‌ ఎలవెన్సులు, తట్ట, పార, గునపం డబ్బులు కొనసాగించాని కోరారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించకుండా వస్తుందని దీని వలన వేతనాలు పడిపోతున్నాయని తెలిపారు. మెటీరియల్‌ చార్జీలు పెంచేయడంతో కూలీలకు మరింతగా కేటాయింపు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని, బడ్జెట్లో లక్ష కోట్లు రూపాయలు కేటాయింపులు చేయాలని, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూలీలు పాల్గొన్నారు.

➡️