చాగలమర్రిలో విషాదం
ప్రజాశక్తి – చాగలమర్రి (నంద్యాల జిల్లా) : నీటమునిగితే అనారోగ్యం నయమవుతుందనే మూఢ నమ్మకాలకు అక్కాతమ్ముడు బలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండ్ కాలనీకి చెందిన షేక్ ఖాజా హుస్సేన్, షేక్ ఇమామ్బీ భార్యాభర్తలు. ఇమామ్బీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బావమరిది ఫకీర్మస్తాన్తో కలిసి నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల దర్గా వద్ద పూజలు చేశారు. చాగలమర్రికి వెళుతూ కూలూరు గ్రామ సమీపంలోని కుందూనదిలో స్నానాలు చేసి తిరిగి చూడకుండా వెళ్లాలని దర్గాలోని స్వామి చెప్పారు. దీంతో ముగ్గురు కలిసి కుందూనది వద్దకు వెళ్లారు. షేక్ ఖాజా హుస్సేన్ కుందునది ఒడ్డున ఉండగా షేక్ ఇమాంబి (27), ఫకీర్ మస్తాన్ (26) ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయి మరణించారు. హుస్సేన్ ఫిర్యాదు మేరకు రాజుపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.