కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

May 11,2024 21:26 #dog attack, #old woman dies

ప్రజాశక్తి-జియ్యమ్మవలస :పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి చెందారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం… వెంకటరాజపురానికి చెందిన బంటు లక్ష్మి (70) బహిర్భూమికి వెళ్తున్న సమయంలో ఎనిమిది కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. దీంతో, ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే లక్ష్మి తల పైభాగాన్ని, రెండు కాళ్లను కుక్కలు కొరికేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఇదే గ్రామంలో పది రోజుల క్రితం గొడబ సరోజిని, అలజంగి పార్వతి, ఎం.లక్ష్మిలను కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోయారు.

➡️