పల్నాడులో ఫ్యాక్షన్‌ పంజా…

May 13,2024 16:55 #faction

గృహ నిర్బంధంలో మాచర్ల అభ్యర్థులు
ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్
పల్నాడుప్రాంతంలో అందరూ ఊహించినట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీల అనుయాయుల మధ్య ఎన్నికల సందర్భంగా సోమవారం పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరుపార్టీల వారు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. పోటీపోటీగా ఓటర్లను ఆకర్షించే ప్రక్రియలో ఇరుపార్టీల మధ్య తలెత్తిన వివాదాలు పలుచోట్ల ఘర్షణలకు దారితీశాయి. వైసీపీ అభ్యర్థి, మాచర్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగినట్లుగా సమాచారం. మాచర్ల పట్టణంలో తెలుగుదేశం నాయకుడు కేశవరెడ్డి నివాసంలో ఉన్న ఆ పార్టీ నాయకులుపై వైసిపి వారు వచ్చి మూకుమ్మడి దాడులు చేశారు. మరికొందరు పారిపోతుండగా కారులో వెంబడించారు. ఈ దాడుల్లో పదిమంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. రెంటచింతల మండలం పాలువాయి గేటు గ్రామంలో మాచర్ల ఎమ్మెల్యే పిఆఆర్‌కె వాహనాన్ని టిడిపి వారు ధ్వంసం చేశారు. పల్నాడుజిల్లా ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్‌ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్‌ కారు పై టిడిపికి చెందిన వారు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనను మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఓడిపోతామని నిరాశతో టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారన్నారు. పోలీసులు రబ్బరు బుల్లెట్లను వినియోగించారు. తుళ్ళూరు మండలం పెదపరిమిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి నేత సందీప్‌,, టిడిపి నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పలువురు ఈ ఘటనలో గాయాలపాలయ్యాయి. గుంటూరు కొరిటపాడులో ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల లాఠీ చార్జి చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్‌పితో మంత్రి విడుదల రజనీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు. పల్నాడులో పోటాపోటీ దాడులుపల్నాడులో వైసిపి, టిడిపి నాయకులు భారీగా తెగబడుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ తరుపున ఏజెంట్‌ ఫామ్‌ ఇవ్వడానికి వెళ్లిన సుబ్బయ్యపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బయ్యను వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అలాగే అటు మాచర్ల నియోజకవర్గంలోనూ వైసీపీ దౌర్జన్యానికి దిగింది. రెంటచింతలలో టీడీపీ ఏజెంట్లు దాడికి పాల్పడ్డారు. నలుగురు టీడీపీ ఏజెంట్లకు తలలు పగిలాయి. ఏజెంట్లుగా టీడీపీ వాళ్లకు ఉండటానికి వీలేద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఈవిఎంలను ధ్వంసం చేశారనే అభియోగంమాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారని వైసిపి నాయకులు విమర్శించారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్‌ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు. 203, 204, 206 పోలింగ్‌ బూత్‌ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారని ఆరోపించారు. ఇరుపార్టీల వారు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద మోహరించటంతో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి, వైసిపి వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నారు.

➡️